Thursday 11 April 2024

శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయం

తూర్పుగోదావరి జిల్లాలోని, పవిత్రగోదావరినది ఒడిలో ఉన్న కోనసీమలో పచ్చని పంటపైరులు, కొబ్బరిచెట్లమధ్య కుండలేశ్వరం అనే ఊరిలో, ఒక శివాలయం ఉన్నది. ఆలయంలోని స్వామి కుండలేశ్వరుడు. వృద్ధ గౌతమీనది పుణ్యజలంలో స్నానమాచరించి, ఆ తర్వాత కుండలేశ్వరుని దర్శించి, భక్తిశ్రద్ధలతో పూజలు జరిపెంచుకుంటారు అక్కడికి వచ్చే భక్తులు. కవి స్వారభౌముడైన శ్రీనాధమహాకవి తన భీమఖండం (భీమేశ్వరపురాణం)లో గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి వ్రాశాడు. గౌతమీ మహత్మ్యం అనే గ్రంథంలో ఈ క్షేత్రమహిమను గురించి నూటమూడవ అధ్యాయంలో ఉంది. *** ఈ కుండలేశ్వరం క్షేత్రం దగ్గర చాలా వేగంగా వెళుతున్న గోదావరి, సముద్రఘోషని విని కోపంతో, ఉధృతమైన మహావేగంతో పాతాళలోకంలో ప్రవేశించి, అక్కడ ఉన్న సముద్రుడ్ని బెదిరించాలి అనుకుంది. అయితే, గోదావరి ఆలోచనలను సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యలను, రెండు కుండలాలను ఒక పశ్ళెంలో వుంచి గౌతమికి ఎదురెళ్లాడు. గౌతమీ నది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నా మీద కోపం వద్దు. సూర్యభగవానుని తేజస్సుతో మెరు స్తున్న ఈ రెండు కుండలాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను. లోగడ వరుణ దేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని అన్నాడు. గౌతమీ నది కరిగిపోయి, సముద్రుని కోరికమేరకు తన వేగాన్ని తగ్గించు కుని, అక్కడ ఈశ్వర ప్రతిష్ఠకి అంగీకరించింది. సముద్రుడు గౌతమీనదికి కానుకగా రెండు కుండలములను ప్రసాదించాడు. అందులో ఒకదానిని మానవులు శ్రేయస్సు కొరకు కుండలేశ్వర క్షేత్రమున ప్రతిష్టించిన లింగము కొరకు, రెండవ కుండలమును దేవతల కొరకు నదీ గర్భంలో స్థాపించబడినదని ఆ క్షేత్ర అర్చకులు చెబుతారు. అందుకే ఆ క్షేత్రమునకు కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది అని చెప్పారు. ***
నదీగర్భంలో ప్రతిష్ఠ చేసిన శివుని ఆలయం కంచుతో దేవతలే స్వయంగా నిర్మించారని ఇక్కడి స్థలపురాణం వెల్లడిస్తోంది. దేవతలు ఈశ్వరునికి ప్రతి రాత్రి పూజాభిషేకాలు జరుపుతున్నట్లుగా తెలియచేయబడింది. రాత్రి సమయంలో గోదావరీ నదిలోంచి, ఆ ప్రాంతాన కంచు గంటలు మ్రోగిన ధ్వనులు వినిపిస్తాయని ఇక్కడి వృద్ధులు చాలామంది చెప్తారు. గౌతముడు ఒక వృద్ధ స్ర్తితో కలసి ఈ కుండలేశ్వర క్షేత్రానికి వచ్చి, ఈ నదిలో స్నానం చేసిన తర్వాత, ఆ వృద్ధ మహిళ చిన్న యవ్వనవతిగా, ఒక కన్యగా మారిపోయిందనీ, గౌతముడు కూడా యువకునిగా మారినట్లు, ఆ తర్వాత వారిద్దరూ దంపతులై నూతన జీవితాన్ని ఆరంభించినట్లుగాను స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది. గౌతమీ మహాత్యమను గ్రంథం ద్వారా కూడా తెలుసుకోవచ్చును. *** కుండలేశ్వరము దక్షిణ కాశీగా పేరుపొందింది. ఈ క్షేత్రమును గురించి, మార్కండేయుడు రచించిన చంద్రశేఖరాష్టకంలో ఉన్నది. కుండలేశ్వర ఆలయ విమాన గోపురం మీద ఇరవైమూడు శివలీలలు వర్ణింపబడి ఉన్నాయి. శివుని వివిధ రూపాలు, ఆ విమాన గోపురం మీద దర్శనమివ్వడమన్నది ఈ ఆలయపు ప్రత్యేక విశేషం. ఆ రూపాలు 1) నటరాజస్వామి 2) వీరభద్రుడు 3) లింగోద్భవమూర్తి 4) సోమాస్కందమూర్తి 5) భిక్షాటనమూర్తి 6) కిరాతమూర్తి 7) హరిహరమూర్తి 8) కల్యాణసుందరమూర్తి 9) చండశానుగ్రహమూర్తి 10) శరభసాళ్ళమూర్తి 11) అర్థనారీశ్వరుడు 12) మన్మధ సంహారి 13) గణేశానుగ్రహమూర్తి 14) ఏకపాదుడు 15) వృషభారూఢుడు 16) దక్షిణామూర్తి 17) ఆజారిమూర్తి 18) విషాన హరుణుడు 19) కంకాళుడు 20) త్రిపురాసుర సంహారుడు 21) చక్రపధానుడు 22) చండశానుగ్రహుడుతోపాటు ముఖ మంటపంపైన భక్తమార్కండేయుడు ఉంటాడు. వ్యాస మహర్షిని కాశీలో శివుడు కాసీబహిష్కరణ విధించినప్పుడు వ్యాసుడు ఆగ్రహంతో కాశీ నుంచి వచ్చిన సమయంలో, కుండలేశ్వరంను దక్షిణ కాశీగానూ, సమీపంలో ఉన్న, వ్యాసునిచే ప్రతిష్టింపబడిన వ్యాసేశ్వరుని గ్రామమున కేశవకుర్రును వ్యాసకాశీగానూ చేయాలని నిశ్చయించుకున్నాడు. కాశీలోని గంగానదిలో, అనేక వేల మంది భక్తులు స్నానమాచరించి, తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటున్నారు. గంగామాతకు అంటుకున్న ఆ పాపాలను పోగొట్టుకోలేక కాశీ నుంచి వచ్చి రాత్రి సమయంలో, కుండలేశ్వర క్షేత్రంలో ని వృద్ధ గౌతమీనదిలో మునిగి, ఆ నీటిలో స్నానమాచరించి, తనలోని మలినాలను పోగొటుకుని ఆ నీటిలో పవిత్రతను సాదించుకుంటుంది అని ఇక్కడి స్థల పురాణం.
ఇక్కడి గోదావరిలో స్నానం చేసి, కాశీ గంగలో స్నానం చేస్తే గంగకు మైల అంటదని ప్రతీతి! ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కరసమయంలో స్నానదానపూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుందని స్థల మహత్యం చెప్తుంది. ఇక ఈ ఆలయ పూజారులు 700 సంవత్సరాలనుంచీ పరంపరగా కొనసాగుతున్నారని అర్చకుల కుటుంబంలోని ఆరవతరం ఆయన చెబుతున్నారు. ***
కుండలేశ్వరుని దర్శించి కాశీ క్షేత్ర దర్శనం చేసుకుంటే గానీ సంపూర్ణ కాశీయాత్ర పుణ్యం లభించదని భీమేశ్వర పురాణంలో ఉన్నదట! అందుకని అందమయిన నదీసాగర సంగమం లోని ఈ క్షేత్ర దర్శనం చేసుకుని తరిద్ధామా!